Raghav chadha: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, రాఘవ్ చద్దా ఎపిసోడ్ ఇందుకు సాక్షక్యంగా నిలుస్తోంది. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు చద్దా స్థానంలో పంజాబ్ రాజ్యసభ ఎంపీ అయిన అశోక్ మిట్టల్ను నియమించింది. దీంతో ఆయనను కావాలనే ఆప్ పక్కన పెడుతుందనే వాదన వినిపిస్తోంది. ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆప్కు చద్దా సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చద్దా ఎలాంటి అంశాలను లేవనెత్తలేదని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చద్దా బయపడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి లొంగిపోయారని అన్నారు.
Read Also: Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
ఇదిలా ఉంటే, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవ్ చద్దా త్వరలోనే బీజేపీలో చేరుతారేమో..? అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దేశంలో రాజ్యాంగం, వ్యవస్థలపై దాడి జరుగుతోందని, బెంగాల్లో ఓట్ చోరీ జరుగుతోందని, ఎలక్షన్ కమిషన్ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఎల్పీజీ సంక్షోభం సహా ఎన్నో సమస్యలపై రాఘవ్ మాట్లాడలేదని, బీజేపీ మోడీలను ప్రశ్నించాలంటే ఆయనకు భయం అంటూ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చద్దా భయపడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా చీఫ్ అనురాగ్ ధండా ఆరోపించారు. ఆప్లో స్వాతిమలివాల్ లాగే, రాఘవ్ కూడా తనను తాను ఆప్ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుబాటు ధోరణిని అవలంభిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ముందే అతడి పీఏ తనను కొట్టారంటూ ఆరోపించారు.
