50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ రెండు జ్యోతులను ఏకం చేస్తారు. గణతంత్ర దినోత్సవాలకు సరిగ్గా 5 రోజులు ముందు ఈ మార్పుకు రక్షణ శాఖ శ్రీకారం చుట్టబోతుంది.
Read Also: నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
నేషనల్ వార్ మెమోరియల్లోనే అమర్ జవాన్ జ్యోతి
1914-1921 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుధ్దంలో మరణించిన “బ్రిటీష్-ఇండియా సైన్యానికి” చెందిన సైనికుల సంస్మరణార్ధం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా గేట్ ను నిర్మించింది. 1971 లో పాకిస్థాన్తో జరిగన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి భారత వీర సైనికుల సంస్మరణార్ధం అమర్ జవాన్ జ్యోతిని భారత ప్రభుత్వం 1972లో ఏర్పాటు చేసింది. 1947-48 లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధం నుంచి ఇటీవల గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లే కాకుండా, “ఇండియా గేట్” కట్టడం పై ఉన్న సైనికుల పేర్లను కూడా “నేషనల్ వార్ మెమోరియల్” (రాష్ట్రీయ సమర్ స్మారక్) లో గ్రానైట్ పలకల పై సువర్ణ అక్షరాలతో లిఖించారు. తీవ్రవాదులను తుదముట్టించే “ఆపరేషన్”లే కాకుండా, వివిధ సందర్భాలలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్థం ఏర్పాటైన నేషనల్ వార్ మెమోరియల్లో మొత్తం 25,942 సైనికుల పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించడం జరిగింది. కాబట్టి, రెండు చోట్ల జ్యోతులు కాకుండా ఇక నుంచి ఓకే “అమర్ జవాన్ జ్యోతి” వెలిగేలా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు వాటిని ఏకం చేయనున్నారు.