Gallantry Awards 2026: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు దేశం కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప గౌరవం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78 శౌర్య పురస్కారాలు, 89 ‘మెన్షన్స్ ఇన్ డిస్పాచెస్’కు ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 78 శౌర్య పురస్కారాల్లో 13 మందికి మరణానంతరం ఈ గౌరవం లభించనుంది. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది శాంతికాలంలో, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు ఈ పురస్కారాలు అందించనున్నారు.
9 కీర్తి చక్రాలు
ఈ ఏడాది తొమ్మిది కీర్తి చక్రాలు, ఒక శౌర్య చక్ర బార్, 19 శౌర్య చక్రాలు, ఐదు సేనా పతకం బార్లు, 36 సేనా పతకాలు, మూడు నౌకాదళ శౌర్య పతకాలు, ఐదు వైమానిక దళ శౌర్య పతకాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. శాంతికాలంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను ఈసారి ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మాన్యో ఫ్రాన్సిస్, మేజర్ జితేంద్ర రాఠీ, హవల్దార్ గజేంద్ర సింగ్లకు ప్రదానం చేయనున్నారు. గజేంద్ర సింగ్కు మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా దళాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్, కానిస్టేబుల్ జస్వంత్ సింగ్, కానిస్టేబుల్ బల్విందర్ సింగ్, కానిస్టేబుల్ తారిఖ్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్లకు కూడా కీర్తి చక్రలు అందనున్నాయి.
అస్సాం రైఫిల్స్ మేజర్కు శౌర్య చక్ర బార్
అస్సాం రైఫిల్స్కు చెందిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్య చక్ర బార్ ప్రకటించారు. గతంలోనే ఆయన శౌర్య చక్ర అందుకున్నారు. అదే పురస్కారం మరోసారి లభించినప్పుడు కొత్త పతకానికి బదులుగా ఇప్పటికే ఉన్న రిబ్బన్కు బార్ను జత చేస్తారు.
19 మందికి శౌర్య చక్ర
ఈ ఏడాది 19 మంది సైనికులకు శౌర్య చక్ర పురస్కారాలు దక్కనున్నాయి. వీరిలో మేజర్ పరమవీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, నాయిబ్ సుబేదార్ శంకర్ రామ్, హవల్దార్ జగ్తార్ సింగ్, లాన్స్ నాయక్ నరేంద్ర సింధు ఉన్నారు. నరేంద్ర సింధుకు మరణానంతరం శౌర్య చక్ర ప్రదానం చేయనున్నారు. నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ శివం కుమార్, వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సుధీర్ కుమార్లకు కూడా శౌర్య చక్ర లభించనుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఆరుగురు సిబ్బందికి కూడా ఈ పురస్కారం ప్రకటించారు. వీరిలో డీఎస్పీ ధీరజ్ సింగ్ కటోచ్, ఇన్స్పెక్టర్ అజయ్ సింగ్ చిబ్ ఉన్నారు. అలాగే మేజర్ డి.ఎస్.పావోషో, మేజర్ కృష్ణకాంత్ సహా ఐదుగురు అధికారులకు సేనా పతకం బార్లు అందించనున్నారు. మరో 36 మంది సైనికులకు సేనా పతకాలను ప్రదానం చేయనున్నారు. ఈ జాబితాలో కల్నల్ పుష్కర్ విజయ్ చౌదరి, మేజర్ మోహిత్ పోడియా, కెప్టెన్ కరణ్ సింగ్ చీమా, కెప్టెన్ అన్షుమాన్ సింగ్, సుబేదార్ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. సుబేదార్ ప్రభాత్ గౌర్, లాన్స్ హవల్దార్ పలాష్ ఘోష్, సిపాయి హర్మిందర్ సింగ్ సహా ఐదుగురికి మరణానంతరం సేనా పతకాలు లభించనున్నాయి. నౌకాదళానికి చెందిన కమాండర్ వినీత్ శర్మ, కమాండర్ యువరాజ్ కుమార్, అవినాష్ అన్నాసోల్తో పాటు వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ రాహుల్ జగోటా, గ్రూప్ కెప్టెన్ రాహుల్ రావత్, వింగ్ కమాండర్ ఆశిష్ రాజ్పుత్, ఫ్లైట్ లెఫ్టినెంట్ యష్, పారాచూట్ జంప్ ఇన్స్ట్రక్టర్ ఎం.డబ్ల్యూ.ఓ రవీందర్జీత్ సింగ్లకు కూడా సేనా పతకాలు ప్రదానం చేయనున్నారు.
89 ‘మెన్షన్స్ ఇన్ డిస్పాచెస్’కు ఆమోదం
విశిష్ట సేవలకు గుర్తింపుగా 89 ‘మెన్షన్స్ ఇన్ డిస్పాచెస్’కు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీరిలో 75 మంది సైన్యానికి, నలుగురు నౌకాదళానికి, 10 మంది వైమానిక దళానికి చెందినవారు ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బంది ధైర్యసాహసాలకు ఈ పురస్కారాలు మరోసారి గుర్తింపుగా నిలవనున్నాయి.

