కల్తీ కల్లు, కల్తీ మద్యం సేవించి ప్రాణాలు విడిచిన ఘటనలు ఇంకా అక్కడక్కడ వెలుగు చూస్తేనే ఉన్నాయి.. తాజాగా బీహార్లో కల్తీ మద్యం తీవ్ర కలకలం సృష్టించింది.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తేం.. కల్తీ మద్యం కాటుకు గోపాల్గంజ్ జిల్లాలో 16 మంది మృతి చెందారు. ఇక, వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో మరో ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు.. వీరి మృతికి నకిలీ మద్యమే కారణమని అధికారులు తెలిపారు.. అయితే, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఆ తర్వాతే వారి మరణాలకు గల కచ్చితమైన కారణం తెలుస్తాయని చెబుతున్నారు అధికారులు. మరోవైపు.. మృతుల్లో దాదాపు 20 మంది గిరిజనులే అని పేర్కొన్నారు పోలీసులు. అయితే, ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది.. దీంతో.. కల్తీ మద్యాన్ని ఆశ్రయించి.. ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.