NTV Telugu Site icon

Ashwini Vaishnaw: లోకో పైలట్లు తాగి విధులకు వస్తున్నారా..? ఐదేళ్లలో బ్రీత్‌లైజర్ టెస్టుల్లో 1761 మంది ఫెయిల్..

Indian Railways

Indian Railways

Ashwini Vaishnaw: రైల్వేలో ఒక్క పొరపాటు, ఒక్కరి తప్పు వేల మందిని బలిగొంటుంది. అలాంటి రైల్వేలో సిబ్బంది, లోకో పైలట్లకు సంబంధించి పరీక్షలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి. తాజాగా రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రైల్వే అధికారులు మొత్తం 8,28,03,387 బ్రీత్‌లైజర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఐదేళ్ల కాలంలో 1761 మంది లోకోపైలట్లు బ్రీత్‌లైజర్ పరీక్షలో ఫెయిల్ అయ్యారని శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. ఇందులో 674 మంది ప్యాసింజర్ లోకోపైలట్లు కాగా.. 1087 మంది గూడ్స్ లోకోపైలట్లుగా తేలింది. పరీక్షల్లో విఫలమైన లోకో పైలట్లు రైలును నడపేందుకు అనుమతించబడరు. నిర్దేశించి విధానాల ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతాయని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Read Also: Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..

2014 నుంచి రైల్వేలో అందరు లోకో పైలట్లు, వారి అసిస్టెంట్లు తమ షిఫ్ట్ విధుల్లో చేరే ముందు వారికి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(BAC) అంచనా వేసేందుకు బ్రీత్‌లైజర్ పరీక్షను తప్పనిసరిగా చేశారు. నిబంధనల ప్రకారం, BAC స్థాయి 100 ml రక్తానికి 1-20 మిల్లీగ్రాముల మధ్య ఉంటే, డ్రైవర్ సర్వీస్ రికార్డ్‌లో ఉల్లంఘన పేర్కొనబడుతుంది. అది 21 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, డ్రైవర్‌ని సర్వీసు నుంచి తీసేస్తారు.

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించిన డేటా ప్రకారం.. ఉత్తర రైల్వేలో ఎక్కువ బ్రీత్‌లైజర్ పరీక్షలు జరిగాయి. ఇక్కడ ఏకంగా 521 మంది లోకో పైలట్లు పరీక్షల్లో విఫలమయ్యారు. ఈ గణాంకాల్లో దక్షిణ మధ్య రైల్వే మెరుగైన స్థానంలో ఉంది. ఉత్తర రైల్వే తర్వాత పరీక్షల్లో దక్షిణ మధ్య రైల్వే రెండోస్థానంలో ఉంది. ఇక్కడ 85,25,988 పరీక్షలు నిర్వహిస్తే.. కేవలం 73 మంది లోకో పైలట్లు ఫెయిల్ అయ్యారు.