ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మునిగిపోయారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గుప్తార్ ఘాట్లో వద్ద స్నానాలు వెళ్లిన సమయంలో… వారంతా నీట మునిగిపోయారు. ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులంతా ఆగ్రాలోని సికందారా ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ కుటుంబమని తెలుస్తోంది. అయోధ్య సందర్శన కోసం వచ్చారు. సరయూ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.