గుజరాత్లోని పటాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందనే కారణంగా 14 ఏళ్ల బాలికను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండు కొట్టించి ముఖానికి నల్లరంగు పూశారు. బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఇదే విధంగా శిక్షించి ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. అనంతరం బాలికకు అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తితో వివాహం చేసినట్లు వెల్లడించారు.
Read Also: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం
కాగా బాలికను శిక్షించిన ఘటనకు సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశామని.. 22 మందిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. నవంబర్ 10న హారిజ్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మరోవైపు తమ బాలికను ఎత్తుకెళ్లి యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను ప్రేమించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.