Vishwanath and Sons Trailer: తమిళ స్టార్ హీరో సూర్య, ‘ప్రేమలు’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కుర్రకారు కలల రాణి మమిత బైజు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ విశేష ఆదరణ పొందగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.
సరికొత్త రోల్లో సూర్య.. అలరిస్తున్న ‘ఏజ్ గ్యాప్’ లవ్ స్టోరీ
ట్రైలర్ పరిశీలిస్తే సూర్య, మమితా బైజుల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కూల్ అండ్ క్లాసీ లుక్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ‘సంజయ్ విశ్వనాథ్’ అనే ఒక ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో మెరవనున్నారు. తన కంటే వయసులో చాలా చిన్నదైన కథానాయిక మమితా బైజు, సూర్య జీవితంలోకి అడుగుపెట్టి ఆయన్ని ఆరాధించే క్రమాన్ని , వారి మధ్య ఉన్న ‘ఏజ్ గ్యాప్’ చుట్టూ తిరిగే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో హృద్యంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఆలోచింపజేసే సంభాషణలు.. హృదయాన్ని తాకే సంగీతం
సినిమాలో సూర్య చెప్పే ప్రతి డైలాగ్ ఎంతో లోతైన అర్థంతో ఇంటెన్స్గా సాగాయి. ముఖ్యంగా “మన డబ్బు, స్టేటస్, అన్నీ మనకు సౌకర్యాన్ని ఇవ్వాలి.. అంతేగానీ అహంకారం కాకూడదు” అని చెప్పే మాటలు, అలాగే “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండీ.. ఒక గొడవ జరిగిన తర్వాత మళ్లీ ఎలా మాట్లాడాలో తెలియక” , “గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు” వంటి డైలాగ్స్ ప్రేక్షక దేవుళ్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. దీనికి తోడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లోని ఎమోషన్స్ను మరో స్థాయికి తీసుకెళ్లి ప్రాణం పోసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా అత్యంత విలాసవంతమైన నిర్మాణ విలువలతో ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.

