మాటలతో గారడి చేసిన డి.వి.నరసరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 15న డి.వి.నరసరాజు జయంతి)
డి.వి.నరసరాజు పెద్ద మాటకారిగా అనిపించరు కానీ, ఆయన పాత్రలు మాత్రం మాటలతో తెగ సందడి చేస్తుంటాయి. అట్లాగని అదేపనిగా ప్రాసల కోసం ప్రాయస కూడా కనిపించదు. జన సామాన్యంలోని పదాలతోనే అదను చూసి పదనుగా కలాన్ని పరుగులు తీయించడంలో మేటి డి.వి.నరసరాజు. తెలుగు పలుకుబడిని ఉపయోగించడంలో నరసరాజు అందెవేసిన చేయి. పాత సామెతలను సైతం పట్టుకువచ్చి సందర్భోచితంగా ప్రయోగించేవారు. నాటకరంగంలోనే నరసరాజు బాణీ భళా అనిపించుకుంది. ఆయన ప్రతిభ చూసిన దిగ్దర్శకులు కేవీ రెడ్డి తన ‘పెద్దమనుషులు’ చిత్రం ద్వారా నరసరాజును చిత్రసీమకు పరిచయం చేశారు. అప్పటి నుంచీ చివరి దాకా నరసరాజు పాళీ పరవశింపచేస్తూనే సాగింది.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాల్లూరు నరసరాజు స్వస్థలం. చదువుకొనే రోజుల నుంచీ ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలించేవారు. అదే ఆయనలో హేతువాదాన్ని నెలకొల్పింది. ప్రఖ్యాత హేతువాది ఎమ్.ఎన్.రాయ్ ప్రభావం నరసరాజుపై ఉండేది. హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, మద్రాసు లయోలా కాలేజ్ లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ నాటకాలు రాస్తూనే ఉండేవారు. “ఈ ఇల్లు అమ్మబడును, వాపసు” అనే నాటకాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అప్పుడే కేవీ రెడ్డి దృష్టిలో పడ్డారు- ‘పెద్దమనుషులు’ చిత్రకథనంలో కేవీరెడ్డితో కలసి పాలు పంచుకున్నారు. సంభాషణలు పలికించారు. నటీనటుల మాట కన్నా, వారి హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా నరసరాజు రచనలు సాగేవి. అంటే తన స్క్రిప్ట్ లో కేవలం సంభాషణలే కాకుండా, పాత్రల హావభావాలను సైతం చక్కగా పొందుపరిచేవారు. ‘పెద్దమనుషులు’లో ఓపెనింగ్ సీన్ లోనే పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చే సన్నివేశాన్ని చూస్తే, అందులో పాత్రలు ప్రవర్తించే తీరులోనే నవ్వులు పూస్తాయి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’లోనూ పూటకూళ్లమ్మ ఇంటి వద్ద పొడుపుకథలతో నరసరాజు సాగించిన సంభాషణం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. షేక్స్ఫియర్ ‘హామ్లెట్’ను బి.యన్.రెడ్డి “రాజమకుటం”గా మలచినప్పుడూ నరసరాజు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. అందులో కథానాయకుడు ప్రతాపసింహుడు పిచ్చివాడిగా నటించే సమయంలో వల్లించిన మాటలు భలేగా ఆకట్టుకుంటాయి. ఇక ‘గుండమ్మ కథ’లో పలు సన్నివేశాలలో నరసరాజు బాణీ అలరిస్తుంది. ఆయన రాసిన ‘రాముడు-భీముడు’ కథను విజయాధినేతలు, తరువాత మరికొందరు నిర్మాతలు సినిమాకు పనికిరాదన్నారు. అదే కథను డి.రామానాయుడు తన తొలి చిత్రంగా తీసి విజయం సాధించారు. ఆ తరువాత అదే కథ తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయింది. మొదట్లో ఆ కథను వద్దనుకున్న నాగిరెడ్డి, చక్రపాణి తమిళ, హిందీ చిత్రాలను నిర్మించడం విశేషం. అలా జనాన్ని కట్టిపడేసే కథలూ రాసి మెప్పించారు నరసరాజు. ‘భక్త ప్రహ్లాద’ పౌరాణిక చిత్రంలోనూ నరసరాజు కలం బలం భలేగా పనిచేసింది.
యన్టీఆర్ హీరోగా రూపొందిన “నాదీ ఆడజన్మే, సి.ఐ.డి., తిక్కశంకరయ్య, బడిపంతులు, వాడే-వీడు, మగాడు, యమగోల, కేడీ నంబర్ వన్, యుగంధర్, శృంగార రాముడు, వయ్యారిభామలు- వగలమారి భర్తలు” చిత్రాలకు నరసరాజు మాటలతో మత్తు చల్లి అలరించారు. ముఖ్యంగా ‘యమగోల’ చిత్రానికి నరసరాజు పలికించిన సంభాషణలు ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి. సమకాలీన సమస్యలను, రాజకీయాలనూ ‘యమగోల’లో వ్యంగ్యంగా చిత్రించారు నరసరాజు. ఏయన్నార్ హీరోగా రూపొందిన “మూగనోము, గృహలక్ష్మి, జై జవాన్, ఇద్దరు అమ్మాయిలు, శ్రీరంగనీతులు, రావుగారిల్లు” చిత్రాలకు నరసరాజు రచన చేశారు. యన్టీఆర్ ‘తమ్ముడి పెళ్ళి-మామ భరతం’ అనే స్క్రిప్ట్ ను నరసరాజుతో తయారు చేయించారు. అలాగే ‘పుణ్యదంపతులు’ అనే కథనూ నరసరాజుతో రాయించారు. ఈ ‘పుణ్యదంపతులు’కు పాటలనూ నరసరాజు కలం ద్వారా పలికింపచేశారు. అయితే యన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఆ కథలు చిత్రరూపం దాల్చలేదు. తరువాత నరసరాజు, రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన కొన్ని చిత్రాలకు మాటలు రాశారు. ఆ సంస్థ నిర్మించిన ‘కారు దిద్దిన కాపురం’కు దర్శకత్వం వహించారు. ఇక ఇ.వి.వి. సత్యనారాయణ తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’లో నరసరాజు హీరోయిన్ సీత తాతగా నటించారు. ‘మనసు-మమత’ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు నరసరాజు.
‘ఈనాడు’ దినపత్రికలో నరసరాజు కాలమ్స్ రాసేవారు. వాటిలోనూ చమక్కు చూపించి, పాఠకులకు గిలిగింతలు పెట్టేవారు. విజయాధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి తనయులు చందమామ విజయా కంబైన్స్ పతాకంపై మళ్ళీ చిత్ర నిర్మాణం చేపట్టి, తొలి ప్రయత్నంగా ‘బృందావనం’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి నరసరాజు రచన చేశారు. నరసరాజు కూతురు బిడ్డ శిరీషను హీరో సుమన్ వివాహం చేసుకున్నారు. వారు చెన్నై నుండి మకాం మార్చడంతో నరసరాజు కూడా వారితో పాటు హైదరాబాద్ వచ్చేశారు. తన ఆత్మకథను చెబుతూ రికార్డ్ చేశారు నరసరాజు. తరువాత ‘అదృష్టవంతుని ఆత్మకథ’గా అది వెలుగుచూసింది. నరసరాజు రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో పలువురు తారల సినిమా విశేషాలు చోటు చేసుకున్నాయి. విజయచిత్ర సినిమా పత్రికలో ఆయన రాసిన ‘మొగలి రేకులు’లోని సినిమా విశేషాలు కూడా పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ నాటి సినిమా పెద్దలు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకొనేటప్పుడు నరసరాజు పేరును ప్రస్తావిస్తూ ఉండడం విశేషం!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!