విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే వెంకీ మామ, ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం’ మూడవ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న ‘దృశ్యం 3’ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ రీమేక్ ప్రాజెక్ట్ను చేయడం లేదని స్పష్టమైంది. దీనికి బదులుగా ఆయన పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్పై దృష్టి సారించారు.
Also Read:Ram Pothineni: రామ్ రాసుకున్న కధకి అలాంటి డైరెక్టర్ కావలెను
వెంకటేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూన్ లేదా జూలై నెలల నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఆయన మరో క్రేజీ డైరెక్టర్తో జతకట్టబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ‘F2’, ‘F3’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ‘ఆదర్శ కుటుంబం’ పనులు పూర్తి కాగానే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ను వెంకటేష్ ప్రారంభించనున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. వరుస విజయాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
