ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి రాసిన ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ / పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా / ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం / అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’ అంటూ సాగే గీతాన్ని బుధవారం విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ పాటకు బాణీ సమకూర్చగా, చిన్మయి పాడారు. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మ అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. నాయిక మనోభావాలకు అద్దంపడుతుందీ గీతం.
ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ”ప్రఖ్యాత రచయత సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ‘వరుడు కావలెను’ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, నటీనటుల అభినయం చిత్ర కథానుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకాన్ని చిత్ర దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నదియా, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
