సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘యశోద’లో పరభాషా నటుల ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసి, ఆమెపై షూటింగ్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్… గౌతమ్ పాత్రను చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం తెలిపింది. ‘జనతా గ్యారేజ్’తో టాలీవుడ్ బాట పట్టిన ఉన్ని ముకుందన్ ఆ తర్వాత ‘భాగమతి’లో కీలక పాత్ర పోషించాడు. అలానే రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించాడు.
‘యశోద’ చిత్రీకరణ డిసెంబర్ నెల 6న హైదరాబాద్ లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్, గౌతమ్ పాత్రను ఉన్ని ముకుందన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేసి, జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. హరి – హరీశ్ ద్వయం దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
