Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్

Sumalatha

Sumalatha

టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్‌ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను తమ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్‌లో కావాలనే నెగెటివ్ ప్రచారం స్ప్రెడ్ చేస్తున్నారని, కొందరు పెద్దలు కుట్రపూరితంగా సభ్యులను తప్పుదారి పట్టిస్తున్నారని సుమలత ఆరోపించారు. నిన్న ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీలో సగం మంది అవినీతిపరులే ఉన్నారని విమర్శించారు. ఎవరికి వారు ఇలా కమిటీలు వేసుకుంటూ పోతే సంస్థ మనుగడ ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని స్వయంగా రఘు మాస్టరే తనతో చెప్పారని సుమలత వెల్లడించారు.

ఫిల్మ్ ఫెడరేషన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సుమలత మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమకు కనీసం నాన్-కోఆపరేషన్ నోటీసు కూడా నేరుగా ఇవ్వకుండా, మిగతా 23 క్రాఫ్ట్స్ ద్వారా లెటర్స్ పంపించడం ఫెడరేషన్ కుట్రలో భాగమేనన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు డ్యాన్సర్ల ఇబ్బందుల గురించి చెప్పినా పట్టించుకోలేదని, కమిటీ వేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. తప్పు చేసిన వారికి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎలా సపోర్ట్ చేస్తారని ఆమె సూటిగా నిలదీశారు. ఈరోజు డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు జరిగిన అన్యాయమే, రేపు మిగతా 23 క్రాఫ్ట్స్‌కు కూడా జరుగుతుందని సుమలత హెచ్చరించారు. ఫెడరేషన్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించి అన్ని క్రాఫ్ట్స్ బయటకు రావాలని పిలుపునిచ్చారు. 24 క్రాఫ్ట్స్‌లో ఇప్పటికే చాలా యూనియన్లు ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, వారంతా త్వరలోనే బయటకు వస్తారని జోస్యం చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని తమ డ్యాన్సర్ల సమస్యలను పరిష్కరించాలని సుమలత విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఇప్పటికే తమను పిలిచి మాట్లాడారని ఆమె తెలిపారు. మరోవైపు బాలకృష్ణ తమతో చర్చలు జరిపారన్న వార్తల్లో వాస్తవం లేదని, ఆయనతో తమకు ఎలాంటి సమావేశం జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఈ గందరగోళం అంతా త్వరలోనే సర్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.