శింబు హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ నిర్మించారు. దీనిని ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్. శనివారం ఈ సినిమా విడులైన సందర్భంగా తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.
దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ‘ముందు తెలుగులోఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. ‘స్రవంతి’ రవికిశోర్ ఫోన్ చేశారు. పాటలు బావున్నాయి. ట్రైలర్ నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం అన్నారు. తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని రీసెర్చ్ చేశాం. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. శింబుతో కంఫర్ట్ జోన్ ఉంది. సో… ఈజీగా చేశా. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తా. రవికిశోర్ గారి నిర్మాణంలో రామ్ తో వచ్చే ఏడాది సినిమా చేస్తా’ అని అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘గౌతమ్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సినిమా చేయాలనుకుంటున్నాం. ఆ చర్చలో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ గురించి తెలిసింది. తమిళ వెర్షన్ విడుదలయ్యే వరకూ సినిమా చూడలేదు. బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’, ‘రెండు తోకల పిట్ట’, ‘రఘువరన్ బీటెక్’ చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ ‘గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం చాలా సంతోషంగా ఉంది. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ సినిమా చేస్తున్నారని తెలిసి మా మేనేజర్కి పోస్టర్ స్క్రీన్ షాట్ పంపించా. నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. అవకాశం రావడంతో మాటలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేశా. గ్యాప్ తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.