ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది. థియేటర్లను తిరిగి తెరుచుకోవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కొన్ని విన్నపాలు చేసుకున్నారు. అందులో మొదటగా థియేటర్స్ రీఓపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మిగతా విన్నపాల పట్ల కూడా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.
థియేటర్లు అయితే తెరచుకోవడానికి అనుమతి లభించింది. కానీ ఏ కారణాల చేత అయితే థియేటర్లు మూతపడ్డాయో వాటిని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటిలోగా థియేటర్ల యాజమాన్యాలు సినిమా హాళ్ల నిర్వహణకు కావలసిన కనీస సేఫ్టీతో పాటు అవసరమైన అనుమతులను జాయింట్ కలెక్టర్ల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం తెలిపింది.