రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తప్పించుకోలేరు. ”కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియో డి.ఎస్.కె. మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాటలు తమ డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత, నటుడు డి. ఎస్. రావు చెప్పారు.
దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ, ”డి.ఎస్.కె.మ్యూజిక్ ప్రారంభ చిత్రం ‘తప్పించుకోలేరు’ కావడం మాకు గర్వకారణం. ఏ. ఆర్. రెహమాన్ శిష్యుడు రాజేష్ రాజ్ ఇచ్చిన ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ కు వి. ఎస్. పి. తెన్నేటి అంతే గొప్ప లిరిక్స్ ఇచ్చారు. వరికుప్పల యాదగిరి పాడిన ఫోక్ సాంగ్ ఈ ఆడియోకి హైలైట్ గా నిలుస్తుంది” అని అన్నారు.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘తప్పించుకోలేరు’ చిత్రం ఈనెల 27 విడుదలకు సిద్దమవుతోంది. రవిశంకర్ ఓంకాళి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయిశ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.