ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు సాయి గణేశ్ కూడా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ‘స్వాతిముత్యం’ మూవీని నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
కంటెంట్ బలంతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రచార చిత్రాన్ని ఈ రోజు విడుదల చేశారు. తమ ‘స్వాతిముత్యం’ అక్టోబర్ 5 న విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా గురించి దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ”’స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథ ఇది. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన ఓ యువకుడి జీవితం ఎలా సాగిందన్నదన్నదే ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వినోదాన్ని పుష్కలంగా చోటు కల్పించాం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని మలిచాం” అని అన్నారు.
చిత్ర ప్రచారం కూడా సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ, ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల విడుదల అయిన ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా’ గీతంతో పాటు ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది.
నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
