NTV Telugu Site icon

Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?

Allu Vs Mega War

Allu Vs Mega War

Allu Vs Mega War: అల్లు అర్జున్ – మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీ మెగా – అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా చూడలేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబాలు కూడా మేం ఒక్కటే అని చెప్పుకునే పరిస్థితి చేయిదాటి పోయింది. అసలు ఈ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది..? ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు..?

నాకు ఇష్టమైతే వస్తా.. ఏదైనా చేస్తా.. అంటూ తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్‌కు అల్లు అర్జున్ కామెంట్స్ మరింత అగ్గి రాజేశాయని అర్థమవుతోంది. “మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..” అంటూ అల్లు అర్జున్ ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కామెంట్స్ చేశారు. మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య ఈ మాటలు మరోసారి అగ్గి రాజేశాయి. మెగా ఫ్యామిలీతో తాడోపేడో తేల్చుకునేందుకే అల్లు అర్జున్ సిద్ధమయ్యాడని.. అందుకే ఇలా మాట్లాడారని చెప్పుకుంటున్నారు.

Read Also: Trisha: విజయ్‌ కోసం రూల్‌ బ్రేక్‌ చేసిన త్రిష!

పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల ఆయన ఓ ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని కొందరు గోల పెట్టారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. సినిమా ఇండస్ట్రీపై ఆయన ప్రభావం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన మంత్రి హోదాలో అడవుల పరిరక్షణ గురించి మాట్లాడారు. గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడే వారు.. వాటిని స్మగ్లింగ్ నుంచి కాపాడేవారు.. కానీ ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ నరకడం ఫ్యాషన్ అయిపోయింది.. అన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారని అందరూ చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతివ్వడాన్ని పవన్ మర్చిపోలేదని.. కచ్చితంగా బదులిస్తామని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. వాస్తవానికి ఈ సమ్మర్‌లోనే పుష్ప2 రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఏపీలో పవన్ అధికారంలో ఉండడం, మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన సినిమా యూనిట్ డిసెంబర్‌కు వాయిదా వేసింది.

అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య గొడవ ఎన్నికల ముందు మొదలైంది. అప్పటి నుంచి ఇది రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.
చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి బరిలోకి దిగింది. వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ పనిచేశారు. అయితే.. అల్లు అర్జున్ మాత్రం ప్రచారం చివరలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికెళ్లి మద్దతు తెలిపారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అదే సమయంలో “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇది అల్లు అర్జున్‌ను ఉద్దేశించే ట్వీట్ చేశారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఏకంగా ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. చిరంజీవి వారించడం వల్లే నాగబాబు వైదొలిగారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ యాక్టివేట్ చేశారు కానీ పాత ట్వీట్ మాత్రం డిలీట్ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాప్ నడుస్తూనే ఉంది.

Read Also: Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని.. లోపల వాళ్లు బాగానే ఉన్నారని కొందరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ కుటుంబాలకు అత్యంత సన్నిహిత వ్యక్తులు మాత్రం గ్యాప్ ఉన్నమాట వాస్తవమేనంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బన్నీ వాసు పేరు తెలియనివారుండరు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా పేరొందిన బన్నీవాసు ఇప్పుడు అల్లు అరవింద్ అండతో నిర్మాతగా మారారు. అటు పవన్ కల్యాణ్ పార్టీలో కూడా ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ గురించి మాట్లాడారు. అందరూ కలిసి ఉండాలనే చిరంజీవి కోరుకుంటారని.. అయితే అప్పుడప్పుడు కొందరి నిర్ణయాల వల్ల ఇష్యూస్ రావడం సహజమని చెప్పారు. అయితే మేమంతా ఒక్కటే అని వాళ్లంతా చెప్పేందుకు ఒక్క సందర్భం చాలని.. ఆ సమయం రావాలని కోరుకుంటున్నానని బన్నీ వాసు వివరించారు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమేనన్నారు. అప్పటి వరకూ సోషల్ మీడియాలో హడావుడి తప్ప గ్యాప్ గురించి ఎవరూ నోరు విప్పిన సందర్భాలు లేవు. అయితే బన్నీ వాసు మాట్లాడిన తర్వాత ఆ గ్యాప్ నిజమేనని అర్థమైపోయింది.

రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరిందంటే.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా వైదొలిగేంత దూరం వెళ్లిపోయింది. పైకి చెప్పకపోయినా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వాళ్ల చేష్టలు ఆ గ్యాప్‌ను మరింత పెద్దవి చేస్తున్నాయి. సహజంగా చిరంజీవి ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడుండేవారు. కానీ ఇటీవల కాలంలో చిరంజీవి వెంట అల్లు అరవింద్ కనిపించట్లేదు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేశారు. ఆ సమయంలో కూడా అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. అంతేకాక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపు నుంచి అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్‌ను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అన్ ఫాలో చేశారు. తాజాగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి’ అని ముక్తసరిగా ట్వీట్ చేశారు అల్లు అర్జున్. గతంలో మావయ్యా అని సంబోధించేవారు. కానీ ఈసారి అలాంటి పదాలేం లేవు. ఏదో విష్ చేయాలి కాబట్టి చేశారు అన్నట్టుంది. దీని పైన కూడా మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఇద్దరూ పోటాపోటీగా కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇంద్ర రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో బన్నీ పేరు మార్మోగింది. చిరంజీవికి శివాజీ వెన్నుపోటు పొడిచే సందర్భంలో బన్నీ బన్నీ అని ఫ్యాన్స్ అంతా గోల చేశారు. బయట కూడా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోతేనే బెటర్ అని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకూ అల్లు అర్జున్‌కు బ్యానర్లు కట్టేవాళ్లమని.. ఇప్పుడు ఆ ఖర్చులు మిగులుతాయని సెటైర్లు వేస్తున్నారు. అంతకుముందు సరైనోడు బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అని గోల చేశారు. పవన్ కల్యాణ్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్” అని కుండబద్దలు కొట్టేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ను పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్‌కు పొగరు ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యితే అంతకుముందే సైరా నరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మైక్ అందుకోగానే వద్దు వద్దంటూ మెగా ఫ్యాన్స్ గోల చేశారు. ఎవరికీ తెలియని ఒక విషయం చెప్తా అని అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేసినా మెగా ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీన్ని అల్లు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. గొడవ మొదలు పెట్టింది ఎవరో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నిస్తున్నారు.

Read Also: Tollywood: టాలీవుడ్ సూపర్ -10 ఫ్లాష్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..

అయితే మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కు ఒక ప్రధాన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి బయటికొచ్చేందుకే అల్లు ఫ్యామిలీ ఇలా చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లూ మెగా లెగసీకి తమ కుటుంబమే కారణమనే ఫీలింగులో అల్లు ఫ్యామిలీ ఉన్నట్టు సమాచారం. మెగాస్టార్‌గా పేరొందిన చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే. తమ ఇంటి బిడ్డను చేసుకున్న తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనే అల్లు ఫ్యామిలీ ఉన్నట్టు సమాచారం. మెగా లెగసీ అంతా తమ చలవేననే భావనలో వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. మెగా కాంపౌండ్ నుంచి బయటికొచ్చి అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనతో అల్లు అర్జున్ పనిచేస్తున్నారని కొందరు చెప్తున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీపై అడపాదడపా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అల్లు అస్థిత్వాన్ని నిలబెట్టడం కోసమే అల్లు అర్జున్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని.. మున్ముందు కూడా ఇది కొనసాగవచ్చని ఆ కుటుంబ సన్నిహితులు కొందరు చెప్తున్నారు. అల్లు బ్రాండ్‌ను విస్తృతపరచడం కోసమే సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫాం పెట్టడం, అల్లు పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

అల్లు – మెగా ఫ్యామిలీ వార్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే అస్థిత్వ పోరాటమేనని అర్థమవుతోంది. అల్లు ఇంటి అల్లుడైన తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనలో ఉంది అల్లు ఫ్యామిలీ. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ లెగసీ మాటున బతకాల్సి వస్తోందనే భావనలో ఉంది. అందుకే తమ సొంత బ్రాండ్‌ను నిలబెట్టుకోవాలని తపిస్తోంది. అల్లు అర్జున్ కామెంట్స్ ఏదో గాలివాటాన చేస్తున్నవి కాదు.. ఒక ప్లాన్ ప్రకారమే ఆయన మాట్లాడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. మరి ఈ బ్రాండ్ వార్ ఏ స్థాయికి వెళ్తుంది.. ఎక్కడ ఫుల్ స్టాప్ పడ్తుందనేది వేచి చూడాలి..