గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య నడుస్తున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుపై వస్తున్న వార్తల నేపథ్యంలో పంజాగుట్ట సీఐ రామకృష్ణ స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ వివాదానికి మూలమని భావిస్తున్న ఫైనాన్స్ స్కామ్ గురించి సీఐ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు మాకు ఫైనాన్స్ స్కామ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదు. అంతేకాకుండా, బాధితులుగా చెప్పుకుంటున్న వారు ఎవరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రారు” అని స్పష్టం చేశారు. సింగర్ మంగ్లీ తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే, ఆదివారం నాడు సింగర్ మంగ్లీ కూడా అడ్వకేట్ సుబ్బారావుపై తిరిగి ఫిర్యాదు చేశారు.
Also Read : Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!
ఇక ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు కొంతమంది బాధితులతో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. “సుబ్బారావు స్టేషన్కు వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఆల్కహాల్ వాసన రావడాన్ని నేను గమనించాను. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తక్షణమే ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ఆదేశించాను” అని తెలిపారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో సుబ్బారావుకు 27 ఎంజి ఆల్కహాల్ శాతం నమోదైనట్లు సీఐ ధృవీకరించారు. ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్న సమయంలో సుబ్బారావు మీడియా సమక్షంలోనే హంగామా సృష్టించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రెండు వైపుల ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని తెలిపారు.
