తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు నమోదు చేసాము. అంటే హిందీ వెర్షన్ మాత్రమే కాకుండా తెలుగు వెర్షన్పై కూడా ఫిర్యాదు దాఖలైంది. అయితే ఇంత ఆలస్యంగా సినిమాపై కేసు వేయడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ “ఫిబ్రవరి 9న కేసుకు సిద్ధమయ్యాం. 10న ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది” అని చెప్పారు. అయితే అప్పటికే సినిమా విడుదల కావడంతో సమయం మించిపోయిందని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించింది.
Read Also : Bheemla Nayak : క్రేజీ అప్డేట్… సెట్లో మరో డైరెక్టర్ హంగామా
“ఖిలాడి” నిర్మాతలు ట్రేడ్మార్క్ చట్టం కింద తాను రిజిస్టర్ చేసిన “ఖిలాడీ’ అనే టైటిల్ ను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎలాంటి ఆర్థిక నష్టపరిహారం కోసం చూడడం లేదని, కేవలం ‘ఖిలాడీ’ సినిమా ఖ్యాతి గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని జైన్ తెలిపారు. సౌత్ సినిమాల మేకర్స్ తమ టైటిల్లను స్థానిక అసోసియేషన్లలో రిజిస్టర్ చేసి, హిందీలో కూడా అదే టైటిల్తో సినిమాలను విడుదల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందీ చిత్రాల తరహా టైటిల్స్తో డబ్బింగ్ చిత్రాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సీబీఎఫ్సి అనుమతించడమే దానికి కారణమని, కొన్నాళ్ల క్రితం ఇలా ఉండేది కాదని రతన్ జైన్ అన్నారు.
దక్షిణాదిలో ఖిలాడీ అనే సినిమా రూపొందుతోందన్న విషయం తనకు తెలియదని అన్నారు. కొద్దిరోజుల క్రితం ట్రైలర్ విడుదలైనప్పుడే ఆ విషయం తెలిసిందని, ఆ వెంటనే కోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇప్పటి వరకు రవితేజ ‘ఖిలాడీ’ నిర్మాతలు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
