రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రభంజనం చాటుతోంది. ఉత్తరాదిన కూడా ఊహించని రీతిలో స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్గా ఉండటంతో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మెగా పవర్స్టార్ రామ్చరణ్ తన మంచితనాన్ని చాటుకున్నాడు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్వోడీలను ఆదివారం ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించాడు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్టుమెంట్లో పనిచేసిన అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించాడు. వారితో కాసేపు సరదాగా సమయం గడిపిన రామ్చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి 10 గ్రాములు విలువ చేసే బంగారు కాయిన్ కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా వారికి కేజీ స్వీట్ బాక్స్ చొప్పున అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్చరణ్ ధన్యవాదాలు తెలిపాడు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశాడు.
