Jharkhand Protest: జార్ఖండ్‌ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!

Pushpa

Pushpa

Jharkhand Protest: జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వేలాది మంది JPSC-JSSC అభ్యర్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నిరసనకారులు దాటేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, లాఠీఛార్జ్‌ చేసినట్లు సమాచారం. ఈ ఆందోళనలో ‘పుష్ప’ అవతారంలో పాల్గొన్న ఓ యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలోని పాత్రను పోలిన గెటప్‌లో అతడు ‘విధానసభ ఘెరావ్‌’ మార్చ్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘పుష్ప’ సినిమాలోని ‘పుష్ప జూకేగా నహీ’ డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఆ యువకుడు.. “జార్ఖండ్‌ విద్యార్థులు జూకరు.. ఆగరు.. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గరు” అంటూ నినదించాడు. విద్యార్థుల సమస్య జాతీయ మీడియా దృష్టికి వెళ్లాలని, వారికి న్యాయం జరగాలని కోరాడు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన కొన్ని నిరసనలకు సినీ ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన అతడు.. జార్ఖండ్‌ విద్యార్థుల సమస్యకు కూడా అదే స్థాయిలో మద్దతు లభించాలని కోరాడు. మరోవైపు అసెంబ్లీ వైపు వెళ్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. జగన్నాథ్‌పూర్‌ ఆలయం సమీపంలోని చివరి బారికేడ్‌ వద్ద నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఆందోళనకు ముందు విద్యార్థి నేత దేవేంద్ర మహతో.. పోలీసులు అడ్డుకుంటే వారితో ఘర్షణకు దిగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో శాంతియుతంగా అసెంబ్లీ వైపు వెళ్లాలని సూచించారు. నిరసనను నిర్వహిస్తున్న JPSC-JSSC Reforms Manch.. ఆందోళనలో క్రమశిక్షణ కోసం సుమారు 500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

భద్రతా చర్యల్లో భాగంగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆందోళన మార్గంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మొత్తం 1,500 మందికి పైగా సిబ్బందిని విధుల్లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నియామక పరీక్షల్లో అక్రమాలపై ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం ఇప్పటికే 98 శాతం డిమాండ్లను పరిష్కరించామని చెబుతుండగా.. ఆందోళనకారులు మాత్రం తమ 13 ప్రధాన డిమాండ్లలో కేవలం మూడు పరీక్షలను మాత్రమే రద్దు చేశారని చెబుతున్నారు. JPSC, JSSCల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 14వ JPSC సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షతో పాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై CBIతో లేదా జార్ఖండ్‌ వెలుపలికి చెందిన రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.