Prabhas’ Spirit Sets New Record: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జెట్ స్పీడ్లో సాగుతుండగా.. చిత్ర బృందం ఎలాంటి విరామం లేకుండా వరుస షెడ్యూళ్లతో దూసుకెళుతోంది.
స్పిరిట్ షూటింగ్లో ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తయినట్లు, కేవలం 30 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తూ.. ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నారని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్లలో ప్రభాస్ అంకితభావం చిత్ర యూనిట్ను కూడా ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ప్రతి సన్నివేశాన్ని, షూటింగ్ షెడ్యూల్ను పక్కాగా సిద్ధం చేసుకునే ఆయన.. సెట్స్పైకి వెళ్లిన తర్వాత మాత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దర్శకుడిగా పేరొందాడు. ‘స్పిరిట్’ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళిక కారణంగానే షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా కొనసాగుతోందని సమాచారం.
వాస్తవానికి ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాల నిర్మాణానికి చాలా సమయం పట్టింది. అయితే ‘స్పిరిట్’ మాత్రం అందుకు భిన్నంగా.. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా పక్కా ప్రణాళికే ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన షూటింగ్ను కూడా త్వరితగతిన పూర్తి చేసి.. చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

