టాలీవుడ్లో ఒకప్పుడు ‘బుట్టబొమ్మ’గా టాప్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. అవకాశాలు ఇచ్చినపుడు టాలీవుడ్ ను ప్రశంసించి అవసరం తీరక విమర్శలు చేయడం ఆమెకే చెల్లింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజ హెగ్డేపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె దక్షిణాది సినీ పరిశ్రమపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడమే ఇందుకు కారణం.
కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నటన కంటే బొడ్డు, నడుమువంటి అందాలపైనే దర్శకులు ఎక్కువ ఫోకస్ చేస్తారని కామెంట్స్ చేసింది. దక్షిణాది సినిమాల్లో గ్లామర్ ప్రదర్శన శృతిమించుతుందనే అర్థం వచ్చేలా ఆమె చేసిన ఆ కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అప్పట్లోనే ఆమెపై విమర్శలు వచ్చినా తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా పూజా హెగ్డే తన రాబోయే హిందీ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆమె ధరిస్తున్న దుస్తులు, గ్లామర్ షో చూసిన నెటిజన్లు పాత విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సౌత్ సినిమాల్లో నడుము అందాలు చూపిస్తే తప్పు పట్టిన పూజా ఇప్పుడు బాలీవుడ్ కోసం అంతకంటే ఎక్కువ గ్లామర్ ప్రదర్శిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డేను “డబుల్ స్టాండర్డ్స్“ అంటూ ట్రోల్ చేస్తున్నారు. “అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఇప్పుడు మీరు చేస్తున్నది గ్లామర్ షో కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె పాత ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ను తాజా ఫోటోలతో పోల్చుతూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తారో చూడాలి.
