Pawan Kalyan: ప్రపంచ దేశాల్లో ఇండియా మరో కోట రికార్డ్ ను సృష్టించింది. మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఎట్టకేలకు చంద్రునిపై చంద్రయాన్ 3 కాలు పెట్టింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దీంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. ఇండియాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చంద్రయాన్ 3 సక్సెస్ పై తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇక తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
“ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టం. ఇంతటి విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలు సర్వదా అభినందనీయులు. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను అడుగుపెట్టించి… దక్షిణ ధ్రువంపైకి వెళ్ళిన తొలి దేశంగా మనల్ని సగర్వంగా నిలిపారు. చంద్రయాన్-3 సాధించిన ఈ విజయంతో అంతరిక్ష రంగాన భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ చంద్రయాన్-3 మిషన్ సంపూర్ణంగా విజయం సాధించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం – JanaSena Chief Shri @PawanKalyan@narendramodi @BJP4India#Chandrayaan3 #Chandrayaan3Landing
#Isro #India pic.twitter.com/bkkMKeb4L0— JanaSena Party (@JanaSenaParty) August 23, 2023