P Susheela: మరపురాని మధురం… మన సుశీలమ్మ గానం…!
P Susheela: జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా అవార్డు అందుకున్న తొలి గాయకురాలు ఎవరు? నంది అవార్డుల్లో మొదటిసారి ఉత్తమగాయనిగా నిలచిందెవరు? ఈ రెండు ప్రశ్నలకు గానకోకిల పి.సుశీల అనే సమాధానం లభిస్తుంది. తెలుగునేలపై కన్నుతెరచిన ఈ గాకోకిల విజయనగరంలో తొలిగా కువకువల రాగం తీశారు. చలనచిత్రసీమలో మరపురాని మధురాన్ని మన సొంతం చేశారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, సింహళీ, తులు, బాడగ భాషల్లో తన గానామృతం పంచారు సుశీలమ్మ. యాభై వేల పైచిలుకు పాటలు పాడిన సుశీలమ్మ, అందులో పదిఏడు వేల ఆరువందల తొంభై ఐదు సోలో సాంగ్స్ పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు. మొత్తం ఐదు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిచారు సుశీల.
పులపాక సుశీల 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. సంగీతప్రియుల ఇంట జన్మించడం వల్ల చిన్నతనంలోనే సుశీల శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలలో ద్వారం వేంకటస్వామి నాయుడు ప్రిన్సిపాల్ గా ఉన్న సమయంలోనే సంగీతంలో డిప్లొమా కోర్సు చేశారు సుశీల. ఆల్ ఇండియా రేడియోలో ముందుగా సుశీల గానం అలరించింది. అప్పట్లో మన తెలుగువారి రాజధాని మద్రాసు కావడంతో అక్కడకు చేరి, తన గానప్రావీణ్యం ప్రదర్శించారు సుశీల. మన తెలుగు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు ఆమె గాత్రంలోని మాధుర్యాన్ని ముందుగా పసికట్టారు. తాను సంగీతం సమకూరుస్తున్న ‘పెట్రతాయి’ అనే తమిళ చిత్రంలో తొలుత సుశీలతో పాట పాడించారు పెండ్యాల. ఈ చిత్రం తెలుగులో ‘కన్నతల్లి’ పేరుతో రీమేక్ అయింది. ముందుగా తమిళ చిత్రం విడుదలయింది. ఆరంభంలో సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు ఆమెను బాగా ప్రోత్సహించారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో ప్రధాన నాయిక సావిత్రికి నాటి మేటి గాయని పి.లీల నేపథ్యగానం చేయగా, ఉపనాయికగా నటించిన జమునకు పి.సుశీల ప్లేబ్యాక్ పాడారు. రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన ‘చెంచులక్ష్మి’లోని భక్తిగీతాలు పి.సుశీలకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అందులో ప్రహ్లాదుని పాత్రధారి బాబ్జీకి పాడిన “పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా…”, “నారాయణ హరి నారాయణా… శ్రీమన్నారాయణా…లక్ష్మీనారాయణా…”, “శ్రీనాథుని పద సరసిజ భజనే…” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ పాటలు ఈ నాటికీ భక్తజనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం. ఆ తరువాత అనేక చిత్రాలలో పి.సుశీల గాత్రంలో జాలువారిన భక్తిగీతాలు నవతరాన్నీ విశేషంగా అలరిస్తున్నాయి. ఆమె గళంలో జాలువారిన అనేక భక్తిగీతాలు, శృంగార గీతాలు, చిలిపి పాటలు, అల్లరి పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. కాలంతో పాటు పరుగు తీస్తూ సుశీలమ్మ తరువాతి రోజుల్లో ఐటమ్ సాంగ్స్ ను కూడా ఆలపించారు.
Also Read
సుశీలమ్మ తెలుగునాట పుట్టినా, తమిళ చిత్రంతో ముందుగా పరిచయమయ్యారు. ఇక 1969లో ఆమెను జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిపిన చిత్రం కూడా తమిళ సినిమాయే కావడం విశేషం. ‘ఉయర్నద మనిదన్’ చిత్రంలో వాణిశ్రీ పాత్ర పాడే “నాలై ఇంద వేళ్లై పార్తు.. పాల్ పోలవే…” పాట ద్వారా సుశీల తొలి జాతీయ ఉత్తమగాయనిగా నిలిచారు. 1971లో మరోమారు తమిళ చిత్రం ‘సవాలే సమాలీ’ చిత్రంలో పాడిన “చిట్టుక్ కురువిక్కెన్న…” పాట ద్వారా ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డు అందుకున్నారు సుశీల. 1978లో తెలుగు చిత్రం ‘సిరిసిరిమువ్వ’లోని “ఝుమ్మంది నాదం…” పాటకు సుశీల మూడో నేషనల్ అవార్డు దక్కించుకోగా, 1982లో ‘మేఘసందేశం’లో “ఆకులో ఆకునై…” పాటతోనూ మరోమారు జాతీయ ఉత్తమగాయనిగా నిలిచారు. 1983లో ‘ఎమ్.ఎల్.ఏ. ఏడుకొండలు’ చిత్రంలో “ఎంత బీదవాడే…” పాటతో ఐదో జాతీయ అవార్డు అందుకున్నారు.
తెలుగునాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఉత్తమ గాయని’ అవార్డును ప్రవేశ పెట్టగానే దానినీ సొంతం చేసుకున్నారు. 1977లో ‘దానవీరశూరకర్ణ’లో “ఏ తల్లి నిను కన్నదో…” పాటతో సుశీల తొలి నందిని అందుకున్నారు. మొత్తం ఏడు సార్లు నంది అవార్డులు సుశీల సొంతమయ్యాయి. ఇక తమిళ, కన్నడ, మళయాళ సీమల్లోనూ ప్రభుత్వ అవార్డులు ఆమె దరి చేరాయి. 1991లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను ‘కళైమామణి’ అవార్డుతో సత్కరించగా, 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. అదే సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం ‘గానసరస్వతి’గా సుశీలను గౌరవించింది. 2008లో ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఈ కోకిలమ్మ మరిన్ని వసంతాలు చూస్తూ మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!