ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్కు చేరుకోగా, ‘కేజీఎఫ్’ సిరీస్తో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించారు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం కావస్తున్నా, షూటింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పురోగతిపై మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ కీలక విషయాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పనులను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది (2027) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం పని చేస్తోంది.
సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో చాలా వేగంగా ఉంటారని పేరుంది. అయినప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం తీసుకోవడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ 2 రిజల్ట్, మరికొన్ని సమీకరణాల దృష్ట్యా, ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్లో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గట్టుగా, కథలో మరింత పకడ్బందీగా ఉండాలని భావించి దర్శకుడు కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఎలివేషన్లు, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ కలిసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
