సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై అడుగుపెడుతోంది. ‘మిత్ర మండలి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తన డెబ్యూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిహారిక హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడింది.
Also Read : Nagarjuna : నాగార్జున 100వ సినిమాలో నిన్నే పెళ్లాడతా’ జంట మళ్లీ కలుస్తుందా?..
“నటిగా నేను ఒప్పుకున్న మొదటి సినిమా ‘మిత్ర మండలి’నే. కానీ దీని షూటింగ్ షెడ్యూల్ డేట్స్ కారణంగా కొంచం ఆలస్యమైంది. ఈలోగా నేను చేసిన తమిళ సినిమా ‘పెరుసు’ ముందే రిలీజ్ అయింది. అదృష్టవశాత్తూ ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మా సినిమా ‘మిత్ర మండలి’..మూవీ ‘మ్యాడ్’, ‘జాతిరత్నాలు’ తరహా ఫన్ ఎంటర్టైనర్. కథ, పాత్రలు, కామెడీ అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రియదర్శి, రాగ్మయూర్, విష్ణు లాంటి అద్భుత నటులు ఇందులో ఉన్నారు. షూటింగ్ సమయంలో ప్రియదర్శి ‘కోర్ట్’ సినిమా హిట్ అయినా, ఆయన ఎంత సింపుల్గా ఉంటారో చూసి ఇంప్రెస్ అయ్యా” అని చెప్పింది.
అదే సమయంలో తన సోషల్ మీడియా జర్నీ గురించి కూడా నిహారిక ఎమోషనల్గా షేర్ చేసింది. “కాలేజీ రోజులల్లో టైమ్పాస్ కోసం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశా. రెండేళ్లపాటు ఒక్క పైసా రాలేదు. అప్పట్లో మా అమ్మానాన్న ‘హాబీగా వీడియోలు చెయ్యి గానీ, దీన్నే కెరీర్గా ఎంచుకుంటే కాళ్లు విరగ్గొడతాం’ అనేవారు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ నేటికి అదే ప్లాట్ఫామ్ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే “సినీ ఇండస్ట్రీ గురించి బయట చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మనం మన హద్దుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు డార్క్ హ్యూమర్ అంటే ఇష్టం. ఏ పాత్ర చేసినా మా ఫ్యామిలీ కూడా హాయిగా చూసుకునేలా ఉండాలనుకుంటా. తెరపై నా సీన్స్ వస్తే వాళ్లు కళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి రావద్దు,” అంటూ తన విలువలను పంచుకుంది.