నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసిన యూనిట్, శనివారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా పూజాహెగ్డే హాజరవటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ (చినబాబు), నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత
సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజాహెగ్డే మాట్లాడుతూ ‘హీరోయిన్ని అతిథిగా ఆహ్వానించడం అరుదు. నన్ను అలా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్ చిన్నబాబు, వంశీలదే. హారికా అండ్ హాసిని నా కుటుంబ సంస్థ. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన చక్కని ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘2018లో ఈ కథ విని ఓకే చేశా. 2019లో షూటింగ్ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా బ్రేక్ వేసింది. కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో… మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్ కాన్షిడెన్స్ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్ రిలీజ్ కోసమే వేచి చూశారు. ఈ సినిమా హిట్తో
సౌజన్య కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతంతోనే సక్సెస్ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్గా సూట్ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీ కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు. ఇలాంటి వారు ఇండస్ట్రీకి చాలా అవసరం’ అని అన్నారు.
Read Also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
రీతూవర్మ మాట్లాడుతూ ‘ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ దొరకడం అదృష్టం. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో మంచి డాన్స్ నంబర్స్ కుదిరాయి. శౌర్య సపోర్ట్తో నా వర్క్ చాలా ఈజీ అయింది. మా ఈవెంట్కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్హిట్ సినిమా అవుతుంది’’ అని అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద మా సంస్థ దృష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యువతను బాగా ఆకట్టుకునే చిత్రమిది’ అని అన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇందులో ఇతర ప్రధాన పాత్రధారులు.
