Naa Desham: నలభై ఏళ్ళ ‘నా దేశం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Desham:”‘మనదేశం’ అంటూ చిత్రసీమలో ప్రవేశించి, అందరితోనూ పనులు చేయించుకొని, ఇప్పుడు ‘నా దేశం’ అంటూ రాజకీయాల్లోకి వస్తున్నాడు యన్టీఆర్. అంటే ఆయనది ఎంత స్వార్థపూరితమైన బుద్ధో తెలిసిపోతోంది” అంటూ ఆ నాటి కాంగ్రెస్ నాయకులు యన్టీఆర్ ను విమర్శించారు. ఎందుకంటే, ‘నా దేశం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే యన్టీఆర్ 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి, ప్రచార పర్వమూ మొదలు పెట్టారు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు, యన్టీఆర్ ను ఏ విధంగానైనా ప్రజల్లో చులకన చేయాలన్న భావనతో ఆయనపై పలు పలు విధాలా విమర్శలు చేశారు. కొందరు యన్టీఆర్ క్యాస్ట్యూమ్స్ ను ఇంటికి ఎత్తుకుపోతారనీ అన్నారు. మరికొందరు, ఆయన మేకప్ తుడిచే టవల్స్ ను కూడా పట్టుకుపోతారనీ సెలవిచ్చారు. ఇవన్నీ సదరు నిర్మాతలను, మేకప్ ఆర్టిస్టులను అడిగే యన్టీఆర్ తీసుకుపోయే వారు. ఆ విషయాలు సదరు నాయకులకూ తెలుసు. కానీ, యన్టీఆర్ ను రాజకీయాల్లో ఎలాగైనా కించపరచాలన్నదే వారి ధ్యేయం. కాబట్టి అలాగే నోరు పారేసుకొనేవారు. అలా షూటింగ్ మొదలైన దగ్గర నుంచీ జనం నోళ్ళలో నానుతూ ‘నా దేశం’ చిత్రం కేవలం 19 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 1982 అక్టోబర్ 27న దసరా కానుకగా ‘నా దేశం’ జనం ముందు నిలచి, జయకేతనం ఎగురవేసింది.
‘నా దేశం’ చిత్రానికి హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన ‘లావారిస్’ ఆధారం. చివరలో క్లయిమాక్స్ ను యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ సిద్ధాంతాలకు అనువుగా మలచి తెరకెక్కించారు. అందుకు పరుచూరి బ్రదర్స్ రచన, కె.బాపయ్య దర్శకత్వం వన్నె తెచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం, ప్రముఖ నిర్మాత కె.దేవీవరప్రసాద్ సంయుక్తంగా తమ ‘పల్లవీ దేవీ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించారు.
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్!
- Aditya Dhar: 'ధురందర్' తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
‘నా దేశం’ కథ విషయానికి వస్తే – రచయిత్రి సరస్వతీదేవిని ప్రతాపరావు నమ్మించి, మోసం చేస్తాడు. ఓ బిడ్డకు జన్మనిచ్చి సరస్వతీదేవి కన్నుమూస్తుంది. ఆ బిడ్డను కైలాసం అనే తాగుబోతు పెంచుతాడు. ఆ బాబు భరత్ అనే పేరు పెట్టుకుంటాడు. అతని సంపాదనతో కైలాసం తాగుతూ కాలం వెళ్ళబుచ్చుతుంటాడు. ఓ రోజున భరత్ కు తానో అనాథ అని తెలుస్తుంది. ఆ సమయంలోనే డబ్బున్న ప్రతాపరావు కొడుకుతో పరిచయం ఏర్పడుతుంది. అతని ద్వారా ప్రతాపరావును కలుసుకున్న భరత్ అతను చెప్పిన పని చేస్తుంటాడు. ప్రతాపరావు స్నేహితుని కూతురు మోహిని. ఆమెతో భరత్ కు తొలుత పోట్లాట మొదలయి, అది ప్రేమగా మారుతుంది. చివరకు తన కన్నతల్లి ఓ రచయిత్రి అని, ఆమెను ప్రతాపరావు మోసం చేశాడని తెలుస్తుంది. ప్రతాపరావు కొడుకు కూడా తండ్రిలాగే ఓ అమ్మాయిని గర్భవతిని చేసి మోసం చేయాలని చూస్తాడు. దాంతో వారిని భరత్ ఎదిరిస్తాడు. అందువల్ల భరత్ ను మట్టుపెట్టాలని చూస్తారు. వారిని ఎదిరించి, కన్నతండ్రిని, తమ్ముడిని, కాబోయే మామను కట్టేసి వారికి ఏ శిక్ష విధించమంటారో చెప్పమని జనం మధ్యకు తీసుకుపోతాడు భరత్. మీరే మీ విచక్షణతో ఈ దుష్టత్రయానికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించమని కోరతాడు. విధించండి శిక్ష అంటూ భరత్ ఎలుగెత్తి చాటుతూ ఉండగా సినిమా ముగుస్తుంది.
ఇందులో యన్టీఆర్ సరసన జయసుధ నాయికగా నటించారు. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, గిరిబాబు, పద్మనాభం, శివకృష్ణ, జమున, కాంచన, రాజ్యలక్ష్మి, రోహిణీ, కృష్ణవేణి, కాకినాడ శ్యామల, మాస్టర్ హరీశ్, బేబీ మీనా, సిల్క్ స్మిత, పి.యల్.నారాయణ, చలపతిరావు, పి.జె.శర్మ, సుత్తివేలు కనిపించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు పలికించారు. ఇందులోని “ఉన్నాడురా ఆ దైవము.. ఉంటాడురా నీ కోసము..”, “నేనొక నెత్తురు దీపం..”, “రోజులన్నీ మారే..”, “చల్లాపల్లిలో చల్లనమ్మే..”, “ప్రేమకు పేరంటమూ..”, “ఈ చెంప ముద్దందిరో..” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రంలో అడుగడుగున యన్టీఆర్ పార్టీ సిద్ధాంతాలను అనువుగా పలికించడం భలేగా సాగింది.
‘నా దేశం’ చిత్రం సమయానికి యన్టీఆర్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. అయినా తన నిర్మాతలకు ఇచ్చిన మాట కోసం యన్టీఆర్ ముగ్గురు నిర్మాతలకు కలిపి, ఒకే సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చారు. వారిలో ఒకరు ఆయనతో అంతకు ముందు ‘యమగోల’ వంటి సూపర్ డూపర్ హిట్ తీసిన యస్. వెంకటరత్నం, మరొకరు ఆయనతో ‘కథానాయకుని కథ, కేడీ నంబర్ వన్, తిరుగులేని మనిషి” తెరకెక్కించిన కె.దేవీవరప్రసాద్. మరో నిర్మాతకు ఈ ఇద్దరూ కలసి కొంత పైకం ఇచ్చి, ఆయన భాగాన్ని కూడా తామే పంచుకొనేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ సినిమా కోసం యన్టీఆర్ 16 రోజులు పనిచేశారు. రోజుకు రూ.1.5 లక్షల చొప్పున రూ.24 లక్షలు యన్టీఆర్ పారితోషికం పుచ్చుకున్నారు. అప్పట్లో కేవలం 16 రోజులకు అంత మొత్తం పుచ్చుకున్న నటుడు భారతదేశంలోనే లేరు. 19 రోజుల్లో ఈ సినిమా పూర్తయింది. అదే యేడాది యన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాల ప్రభంజనం కొనసాగుతూ ఉండగానే ‘నా దేశం’ జనం ముందుకు వచ్చింది. పైగా యన్టీఆర్ రాజకీయ సిద్ధాంతాలు కూడా ఈ సినిమాలో చోటు చేసుకోవడంతో జనం భలేగా ఈ చిత్రాన్ని ఆదరించారు. రన్నింగ్ పరంగా ‘బొబ్బిలిపులి’ స్థాయిలో ప్రదర్శితం కాకున్నా, ఓపెనింగ్స్ లో ‘నా దేశం’ సంచలనం సృష్టించింది. అప్పట్లో కోటి రూపాయలకు పైగా పోగేసిందీ చిత్రం. ‘బొబ్బిలిపులి’ దాదాపు నాలుగు కోట్లు, ‘జస్టిస్ చౌదరి’ రెండు కోట్లు పోగేయగా, ఈ సినిమా కూడా కోటి రూపాయలకు పై చిలుకు మొత్తాన్ని చూడడం కనీవినీ ఎరుగని చరిత్రగా నిలచింది. ఇందులోని డైలాగ్స్ లో యన్టీఆర్ తన పార్టీ భావాలను పొందుపరచడం వల్ల ‘తెలుగుదేశం’ పార్టీ ఘనవిజయంలో ఈ సినిమా పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు. యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత నటించిన చివరి చిత్రంగా ‘నా దేశం’ చరిత్రలో నిలచింది. ఆ తరువాత మళ్ళీ’బ్రహ్మర్షి విశ్వామిత్ర’ కోసం కెమెరా ముందుకు వచ్చారాయన. మధ్యలో విడుదలైన యన్టీఆర్ చిత్రాలు అంతకు ముందు రూపొందినవే! ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో నటించారాయన. తరువాత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయాన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు, మేజర్ చంద్రకాంత్’ చిత్రాల్లో అభినయించారు యన్టీఆర్.
ఆయన నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. అయితే చివరగా విడుదలైన సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. రామారావు రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం ‘నా దేశం’లోనూ, ఆయన నటజీవితంలో చివరగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లోనూ జయసుధ నాయిక కావడం విశేషం!
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!