తన సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ‘టీజీ ఈఏపీసెట్ 2026’ (TG EAPCET) ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ ‘రెజోనెన్స్ జూనియర్ కాలేజీ’ విద్యార్థిని ఎం. రుషిని ఆయన ప్రత్యేకంగా కలిసి అభినందించారు. మెగాస్టార్ చిరంజీవిని నేరుగా కలవడం అనేది రుషికి చిన్ననాటి కల. పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధిస్తే ఆ కల తప్పకుండా నెరవేరుతుందని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆ మాటలను నిజం చేస్తూ, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన రుషిని, ఆమె కుటుంబ సభ్యులను చిరంజీవి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. ఆమె అంకితభావం, పట్టుదలను మెచ్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. అంతేకాకుండా, ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఒక ల్యాప్టాప్ను బహుమతిగా అందజేశారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ (IAS) అధికారి కావాలన్నదే తన లక్ష్యమని రుషి చెప్పడంతో చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుషి తల్లిదండ్రులతో ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. “అమ్మాయి తన కలను నిజం చేసుకునేలా మరింత ప్రోత్సహించండి. భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా నన్ను సంప్రదించండి. నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించండి” అని చిరంజీవి గారు అభయం ఇచ్చారు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈఏఎంసెట్ (EAMCET) పరీక్ష, ప్రస్తుతం ఈఏపీసెట్ (EAPCET)గా రూపాంతరం చెందింది. ఈ నాలుగు దశాబ్దాల చరిత్రలో అగ్రస్థానాలు ఎక్కువగా అబ్బాయిలే సాధిస్తూ వచ్చారు. కానీ, ఆ రికార్డులను తిరగరాస్తూ టీజీ ఈఏపీసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రుషి చారిత్రాత్మక రికార్డు సృష్టించింది.
#TGEAPCET టాపర్ ఎం. రుషి కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి
స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిని పిలిపించి.. శాలువాతో సత్కరించిన మెగాస్టార్
"టాప్ ర్యాంక్ వస్తే చిరంజీవితో మాట్లాడిస్తా" అని గతంలో మాట ఇచ్చిన రుషి తండ్రి
ఇచ్చిన మాట ప్రకారం.. కూతురు సాధించిన అద్భుత… pic.twitter.com/pp6a2j7eTI
— NTV Breaking News (@NTVJustIn) May 20, 2026
