దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్గా ముద్రపడింది.1987లో విడుదలైన ‘నాయకుడు’ వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్లీ కమల్ హాసన్–మణిరత్నం కాంబినేషన్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ..
Also Read : Rashmika: ధనుష్పై ఎమోషనల్గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..
విడుదల అనంతరం అసలు కథనం, స్క్రీన్ప్లే బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. అందరూ ఎదురు చూసిన సినిమా, తొలిరోజే ప్రతికూల స్పందన తెచ్చుకుంది. రెండు రోజులకే థియేటర్లు ఖాళీ కావడం, అదే సమయంలో భాషా వివాదం కారణంగా కర్ణాటకలో విడుదల కాలేకపోవడం సినిమా పై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ.. పూర్తి థియేట్రికల్ రన్లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీని వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి దాదాపు రూ.150 కోట్లకు పైగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దర్శకుడు మణిరత్నం తొలిసారి స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు.
ఈ ఫెయిల్యూర్పై మొదటిసారి మౌనం వీడి మాట్లాడిన మణిరత్నం.. ‘ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు చెబుతున్నా. మేమెప్పుడూ ‘నాయకుడు’ కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మేము ‘థగ్ లైఫ్’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాం. కానీ, మేం అందించిన దానికంటే ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథ తో మీ ముందుకు వస్తాను’ అంటూ మణిరత్నం వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.