దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లిలో జరుగుతోంది. శంకర్ పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ షూటింగ్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చే కీలక సన్నివేశాలను రాజమౌళి అత్యంత జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు. సినిమా కథలో ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. శంకర్ పల్లి షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఒక చిన్న విరామం తీసుకోనుంది. మహేష్ బాబు షూటింగ్కు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. రాజమౌళి జక్కన్న కూడా తన కుటుంబంతో కలిసి ఒక రిఫ్రెషింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ చిన్న విరామం తర్వాత చిత్ర బృందం తిరిగి వచ్చి మిగిలిన 20 శాతం షూటింగ్ను పూర్తి చేయనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అటు మహేష్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.