ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం తారక్ చేస్తున్న కష్టం, ఆయన డెడికేషన్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ రంగన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.నిజానికి సినిమాలోని పాత్రలో ఎన్టీఆర్ మరీ బక్కచిక్కి ఉన్నారనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద మాట్లాడిన ప్రశాంత్ నీల్ “కేవలం 4 నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఒక దశలో ఆయన చాలా వీక్గా, పాలిపోయిన ముఖంతో, అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించారు. అది చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. వెంటనే ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ను అక్కడితో ఆపేయమని ఆయనను అడిగాను” అని తెలిపారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు కనిపించడంతో ఆయన భార్యతో పాటు చిత్రబృందం మొత్తం తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని ప్రశాంత్ నీల్ గుర్తుచేసుకున్నారు. “అందరూ నాపై కోపంగా ఉన్నారు. నేను కూడా ఎన్టీఆర్ను బతిమిలాడాను. కానీ ఆయన మాత్రం అస్సలు వినలేదు. ‘నీ విజన్ కోసం, ఈ సినిమా కోసం నేను దేనికైనా సిద్ధం’ అంటూ తన కష్టాన్ని కొనసాగించారు. తారక్ డెడికేషన్, మొండితనం చూసి నాకు మాటలు రాలేదు” అంటూ ప్రశాంత్ నీల్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తన డైరెక్టర్ విజన్ కోసం, ఒక అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్టీఆర్ పడుతున్న ఈ కష్టం గురించి తెలిసి అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
