తెలుగు సినీ పరిశ్రమకు ‘సమ్మర్’ అంటే ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే సీజన్. పాఠశాలలకు సెలవులు, ఎండల ధాటికి సాయంత్రం వేళల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బాక్సాఫీస్ను షేక్ చేసేవారు. ‘అడవి రాముడు’ నుండి మొన్నటి ‘బాహుబలి’, ‘ఖుషీ’, ‘పోకిరి’ వరకు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలన్నీ వేసవిలోనే సందడి చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు సినిమాలకు అడ్డాగా ఉన్న సమ్మర్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం భయపెడుతోంది. దీనికి ప్రధాన కారణం IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్).
క్రికెట్ ఫీవర్ కారణంగా పెద్ద సినిమాలు పోటీకి రావడానికి జంకుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’, యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలతో పాటు సమంత ‘మా ఇంటి బంగారం’, నిఖిల్ ‘స్వయంభు’ వంటి సినిమాలు సైతం తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఐపీఎల్ ముగిసే వరకు థియేటర్లకు ఆడియన్స్ రావడం కష్టమని భావించి మేకర్స్ తమ చిత్రాలను జూన్కు పోస్ట్పోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే రెండు నెలల పాటు థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐపీఎల్లో రోజుకు రెండు మ్యాచ్లు ఉంటున్నాయి. దీనివల్ల థియేటర్లలో మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షోలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’ వంటి బ్లాక్బస్టర్ సినిమా కూడా వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఐపీఎల్ దెబ్బకు తలవంచక తప్పలేదు. అలాగే ‘రాకాస’, ‘బైకర్’ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్రికెట్ మత్తులో ఉన్న ఆడియన్స్ను థియేటర్ల వరకు రప్పించలేకపోతున్నాయి. కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మార్చిలో పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరి నుండి మే వరకు సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలంగా మారింది. ఒకప్పుడు బ్లాక్బస్టర్లకు వేదికైన సమ్మర్ ఇప్పుడు ఐపీఎల్ మరియు పరీక్షల కారణంగా ‘అన్సీజన్’గా మారిపోయింది. ఈ కష్టాల నుండి గట్టెక్కాలంటే ఐపీఎల్ ముగిసే వరకు వేచి చూడాల్సిందేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
