Gopichand: ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న ఫిల్మ్ ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. మే 5న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఖుష్బూ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు.
ఇందులోని తన పాత్ర గురించి చెబుతూ, “ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. అందుకే ‘రామబాణం’ నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి. ఆ పాత్రను దర్శకులు మలచిన తీరు చాలా బాగుంది” అని అన్నారు. గోపీచంద్, జగపతిబాబుతో కలిసి నటించడం గురించి తెలుపుతూ, “గోపీచంద్ తో కలిసి మొదటిసారి నటించాను. సెట్స్ లో అతను చాలా సైలెంట్ గా ఉంటారు. కారవాన్ లో కంటే ఎక్కువగా లొకేషన్ లో కుర్చీలో కూర్చోడానికే ఇష్టపడతారు. ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక జగపతిబాబు గారంటే ఆయన నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాలనటిగా వారి జగపతి ఆర్ట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు చేశాను. ఆయన మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామ అని పిలుస్తాను” అని తెలిపింది.
తన కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాల గురించి ముచ్చటిస్తూ, “ఆ సినిమాలను తలుచుకుంటే ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది. కాలేజ్ చదువు పూర్తయ్యాక కూడా మనకి స్కూల్ జ్ఞాపకాలు గొప్పగా అనిపిస్తాయి. అది నాకు స్కూల్ లాంటిది. నా నటనకి అదే కదా పునాది! అప్పుడు రాఘవేంద్రరావు గారు, పి. వాసు గారు, భారతీరాజా గారు, బాలచందర్ గారు, జంధ్యాల గారు, గోపాల్ రెడ్డి గారు ఇలా ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పనిని నేను ఆరాధిస్తాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని తెలిపింది. తమిళంకే ప్రాధాన్యం ఇవ్వడం గురించి వివరణ ఇస్తూ, “మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది. కానీ తెలుగు పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చాక, నేను నా కుటుంబం కోసం అక్కడే ఉండిపోయాను. తమిళ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు గాక తెలుగులో ‘చంటి’ వంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ కొంచెం బాధ ఉంది” అని అన్నారు.
పాత్రల ఎంపిక గురించి చెబుతూ, “మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ రోల్స్ చేశాం, డ్యాన్స్ లు చేశాం. అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. ఎలాంటి పాత్రలు చేస్తున్నారని చూస్తున్నారు. ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు పోషించాలి. అలాంటి పాత్రనే ‘రామబాణం’లో చేశాను. ‘అజ్ఞాతవాసి’లో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు అంగీకరించలేదనుకుంటాను. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ‘వారిసు’ (వారసుడు) లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు. తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అందుకే సినిమాలు తక్కువ చేస్తున్నాను” అని అన్నారు.
తన చిరకాల కోరికల గురించి చెబుతూ, “అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘చీని కం’ లో టబు నటించింది. ఆ ఛాన్స్ టబు కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. నా బెడ్ రూమ్ లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే బాధ ఉంది. ఇక ఇప్పటి వరకూ బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు. ఆయనతో సినిమా చేయాలని ఉంది” అని తెలిపింది.
Ramabanam: బాలకృష్ణతో వర్క్ చేయాలని ఉంది: ఖుష్బూ

Ramabanam