పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం పూర్తి అయ్యింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎ. దయాకర్ రావు తెలిపారు.
దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో మంగళవారం చిత్ర సమర్పకులు ఎ. ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్ చర్చలు జరిపారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తవగానే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథ కావడంతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్గా ‘హరిహర వీరమల్లు’ ను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు.
