GQ honoured Allu Arjun with the title of Leading Man: పుష్ప: ద రైజ్ సినిమా చేసినప్పటి నుంచి.. అల్లు అర్జున్ కెరీర్ అనూహ్య మలుపు తిరిగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా పుణ్యమా అని పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. అఫ్కోర్స్.. అంతకుముందు కూడా జాతీయంగా బన్నీకి క్రేజ్ ఉంది కానీ, ఈ సినిమా కారణంగా ఇతని క్రేజ్ అమాంతం పెరిగింది. రష్యాలోనూ విడుదల అయిన ఈ సినిమా.. ఫిల్మ్ఫేర్ సౌత్లో ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గాను.. జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్నాడు. స్వయంగా జీక్యూ బృందమే హైదరాబాద్కు వచ్చి, బన్నీకి ఆ అవార్డ్ని అందజేసింది. అతడ్ని ‘లీడింగ్ మ్యాన్’ టైటిల్తో గౌరవించింది. ఐకానిక్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి మరీ, బన్నీకి ఈ అవార్డ్ని అందజేశారని సమాచారం.
కాగా.. ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పుష్ప: ద రూల్ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని చాలా గ్రాండ్గా నిర్మించాలని ఫిక్సయ్యారు. నిజానికి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సీక్వెల్ ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకి వెళ్లాల్సింది. కానీ.. ఇది పాన్ ఇండియా హిట్ అవ్వడం, సీక్వెల్పై భారీ అంచనాలు పెరగడంతో, పాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా ఈ సినిమాకి మెరుగులు దిద్దాడు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ కోసమే చాలాకాలం సమయం తీసుకున్నాడు. కొత్తగా కొందరు పేరుగాంచిన నటీనటుల్ని కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.