ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ బలవన్మరణానికి యత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తోటి కళాకారుడు ఈశ్వర్ సాయిపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు బద్దలుకొట్టి ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించారు. “పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఈశ్వర్ సాయిని అరెస్టు చేయకుండా నార్సింగి పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ మాధురి రాథోడ్ స్వయంగా చేసిన ఆరోపణ ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. న్యాయం చేయాల్సిన రక్షకభటులే నిందితుడికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు ఈ వ్యవహారంలో పెను దుమారానికి దారితీశాయి.
ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఒక గదిలో ఉండగా ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఆపై జరిగిన వాగ్వాదాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం ఈశ్వర్ సాయి తన తప్పేమీ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేయగా, అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా సదరు డ్యాన్సర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, విచారణలో జాప్యం జరగడంతో తీవ్ర వేదనకు లోనైన మాధురి.. తనకు న్యాయం జరిగే దారి కనిపించక ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బాధితురాలి ఆరోపణలతో ఈ కేసుపై పోలీసు శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

