Chiraanjeevi met Venkaiah Naidu and congratulated him on the Padma Vibhushan: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా పద్మ విభూషణ్ చిరంజీవి ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇక మరోపక్క FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు వెంకయ్య నాయుడుని కలిసి అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా అలాగే వివిధ శాఖల మంత్రి గా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు.
వెంకయ్య నాయుడు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు అని తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ఈ రోజు వెంకయ్య నాయుడు లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగు వారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి, తెలుగు సాంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు అన్నారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవిని సైతం సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.