V.S. Varma Pakalapati: “‘బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్” వంటి చిత్రాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని, ఇప్పుడు దేశం, భాషలకు అతీతంగా దక్షిణ భారత చిత్రాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాలంటే అబ్బురపడేలా చేశారని, ఈ ఎదుగుదల క్రమం చూసి ప్రాంతీయ, చిన్న దేశాల చలన చిత్ర నిర్మాణ సంస్థలు సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద’ని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కె.సి., యంగ్ క్రేజీ స్టార్ ఆయుష్మాన్, నేపాల్ చలన చిత్ర ప్రముఖులు పేర్కొన్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేపాల్ ఫిల్మ్ ప్రమోషన్ సర్క్యూట్ సంయుక్తంగా నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిమ్ ఎక్స్చేంజి – 2023 సదస్సుకి ఇండియా నుండి ఎఫ్.టి.పి.సి. అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి వి.ఎస్. వర్మ పాకలపాటి హాజరు కాగా ఇందులో నేపాల్ చలన చిత్ర ప్రముఖులు పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేశారు.
దక్షిణాది చిత్రసీమ… ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాంతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రమం తమను అబ్బురపరిచేలా చేసిందని నేపాల్ సీనియర్ హీరో భువన్ కె. సి, యంగ్ హీరో ఆయుష్మాన్ జోషి , నేపాల్ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ‘ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు భాషా బేధాలను చెరిపి అంతర్జాతీయంగా ప్రేక్షకులు మమేకం అయ్యేలా చేస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు అనేక దేశాలలో జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ’ని ఎఫ్ టి పి సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, వి. ఎస్. వర్మ పాకలపాటి పేర్కొన్నారు. నేపాల్ చిత్రాలకు భారత్ దేశంలో వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు నేపాలీ చిత్రాలు ఇండియాలోని పలు లొకేషన్లలో… అలాగే ఇండియన్ మూవీస్ నేపాల్ లో చిత్రీకరణ జరుపుకొనేలా కృషి సల్పుతున్న ఎఫ్ టి పి సి ఇండియా సంస్థ సేవలు అమోఘమని నేపాల్ ఫిలిం ప్రమోషన్ సర్క్యూట్ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు నూతన్ నిపాడే, హిమాల్ కొనియాడారు.