Eerojullo Re Release: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి హిట్స్ అందుకున్నాయి. ఇక ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన ఈ రోజుల్లో చిత్రాన్ని రీరిలీజ్ కు సిద్ధం చేశారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్సెట్టర్ ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ కు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ మారుతీ మొదటి సినిమా ఇది. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించారు. ఇక ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మేకర్స్.. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
మీడియా సమావేశంలో దర్శకుడు మారుతీ మాట్లాడుతూ.. ” సినిమా విడుదలైన 12 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. చాలా చిన్న బడ్జెట్తో సరదాగా చేసిన సినిమా ఇది. మా జీవితాలను మార్చిన సినిమా ఇది. గత 12 సంవత్సరలుగా మా ముగ్గురి జర్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్గా వుంటుంది. అందుకే ఎస్కేఎన్, శ్రీనివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమరీస్ను అందరికి గుర్తు చేస్తే బాగుంటుందని ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా మళ్ళీ ఇప్పడు బిగ్ స్కీన్పై చూసుకోవడం చాలా సంతోషంగా వుంది. ఈ స్వీట్ మొమెరీని అందరూ మరోసారి గుర్తు చేసుకుని సినిమాను చూసి మళ్లీ ఆనందించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ” మా ముగ్గురి కెరీర్లో ఇది చాలా ప్రత్యకమైన సినిమా. పీఆర్ ఓ గా వున్న నన్ను నిర్మాతను చేసిన సినిమా ఇది. మా అందరిని బిజీ చేసిన ట్రెండ్సెట్టర్ సినిమా ఇది. తెలుగు సినీ పరిశ్రమకు మారుతీ లాంటి ప్రతిభ గల దర్శకుడిని అందించిన సినిమా ఈ రోజుల్లో. ఆ రోజున మొదలైన మా ప్రయాణంలో అందరికి మంచి కెరీర్ను ఇచ్చిన సినిమా ఇది. ఈ రోజుల్లో నుంచి బేబీ వరకు నిర్మాతగా నాప్రయాణం, దర్శకుడిగా మారుతీ ప్రస్థానం, శ్రీనివాస్ కెరీర్ ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే కాదు. పుష్కర కాలంలో మా కెరీర్లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు. ఈ సినిమా విడుదలైన తరువాత సినీ పరిశ్రమలో 50 లక్షలతో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్రతిభను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల సహకారం అందించారు. ఇలాంటి సినిమా మళ్లీ వెండితెరపై చూసుకోవడం ఆనందంగా వుంది” అని తెలిపాడు.
నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” ఇది మా ముగ్గురి ఎమోషనల్ జర్నీ. కేవలం 50 లక్షలతో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దర్శకుడు మారుతీ అప్పట్లోనే కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి ఈ సినిమా తీశాడు. మా ప్రమోషన్తో సినిమాను మరింత జనాల్లోకి తీసుకవెళ్లాం. ఈ సినిమా ఇన్స్పిరేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇలాంటి స్వీట్ మెమెరీస్ గుర్తు చేసుకుంటూ ఈసినిమా ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకరావడం సంతోషంగా వుంద” అని అన్నాడు.