బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా, గత కొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, నందు, రవితేజ, నవ్దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్ లు ఈడీ అధికారులు విచారించారు. ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
