“నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆ మాటనే పట్టుకొని సాగారు ఇ.వి.వి. సత్యనారాయణ. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది.
ఇ.వి.వి. సత్యనారాయణ 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను మిత్రులతో చర్చిస్తూ సాగారు ఇ.వి.వి. సినిమాల పిచ్చి ముదరడంతో ఇంటర్మీడియట్ ముందుకు సాగలేదు. ఇలా కాదని పెద్దవాళ్లు పెళ్ళి కూడా చేసేశారు. అయినా సినిమాపై ఆకర్షణ ఏ మాత్రం సన్నగిల్లలేదు. భార్యకు తన మనసులోని మాటను చెప్పి మదరాసు బయలుదేరారు సత్యనారాయణ. అక్కడ పలు ప్రయత్నాలు చేశారు. దేవదాసు కనకాల దర్శకత్వం వహిస్తున్న ‘నాగమల్లి’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత నవతా కృష్ణంరాజు నిర్మించిన చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. అక్కడే ‘నాలుగు స్తంభాలాట’లో జంధ్యాలతో కలసి పనిచేసే అవకాశం లభించింది. అప్పటి నుంచీ జంధ్యాల చిత్రాలకు అసోసియేట్ గా చేస్తూ సాగారు. ఆ తరువాత తానే దర్శకత్వం వహించాలన్న సంకల్పంతో కథలు తయారు చేసుకున్నారు.
ఆయన కథలు విన్నవారు, నవ్వుకున్నవారు, నవ్వేసి ఊరకున్నవారూ ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే సత్యంలో ఏదో ఉందని గుర్తించినది నటనిర్మాత అశోక్ కుమార్. డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్, ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘చెవిలో పువ్వు’ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అన్నీ అమరాయి. కానీ, సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. టైటిల్ దెబ్బ కొట్టింది అని పలువురు చెప్పారు. ఆ సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది రామానాయుడే. ఆయన కాంపౌండ్ లో చేరి పనిచేస్తూ ఉండగా, కమల్ హాసన్ తో నాయుడు ‘ఇంద్రుడు-చంద్రుడు’ నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు కో-డైరెక్టర్ గా పనిచేశారు ఇ.వి.వి. ఆ సమయంలో కమల్ తో కలసి పనిచేయడంతో స్క్రిప్ట్ ఎలా చక్కదిద్దవచ్చునో తెలిసింది. ఆ పై రామానాయుడు నిర్మించిన ‘ప్రేమఖైదీ’ని రూపొందించారు ఇ.వి.వి. ఈ సారి గురి తప్పలేదు. ‘ప్రేమఖైదీ’ మంచి విజయం సాధించింది. ఇక ఇ.వి.వి. వెనుతిరిగిచూసుకోలేదు.
ఇ.వి.వి. సత్యనారాయణ గురువు జంధ్యాల లాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు. రాజేంద్రప్రసాద్ హీరోగా “అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజన్ దొంగలు” వంటి చిత్రాలు రూపొందించి, ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు. ఇక నరేశ్ తో ఇ.వి.వి. తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు. శ్రీకాంత్, హరీశ్, వినోద్ కుమార్ వంటి వర్ధమాన కథానాయకులకు ఇ.వి.వి. చిత్రాలే పేరు సంపాదించి పెట్టాయి. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ‘ఆమె’ వంటి ఆలోచింప చేసే చిత్రాన్నీ రూపొందించారు. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్’ , వెంకటేశ్ తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు’ , బాలకృష్ణతో ‘గొప్పింటి అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ ని తెరకెక్కించిందీ ఇ.వి.వి.నే! అలా సక్సెస్ రూటులో భలేగా సాగిపోయారు ఇ.వి.వి. తానే నిర్మాతగా మారి, ఇ.వి.వి. సినిమా పతాకంపై తొలి ప్రయత్నంగా ‘చాలాబాగుంది’ తీశారు. తరువాత మరికొన్ని చిత్రాలు ఈ బ్యానర్ పైనే రూపొందించారు.
ఇ.వి.వి. సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో రాజేశ్ ను హీరోగానూ, నరేశ్ ను డైరెక్టర్ గానూ చూడాలనుకున్నారు. నరేశ్ కూడా కొన్ని సబ్జెక్టులు రాసుకున్నానంటూ చెప్పేవాడు. అయితే ‘అల్లరి’ చిత్రంతో నరేశ్ హీరో అయ్యాడు. అంతకు ముందు ఇ.వి.వి. డైరెక్షన్ లోనే ‘హాయ్’ చిత్రం ద్వారా రాజేశ్ హీరో అయినా, అంతగా అలరించలేకపోయాడు. తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి ‘నువ్వంటే నాకిష్టం’ తీశారు. అదీ అలరించలేకపోయింది. తరువాత అల్లరి నరేశ్ తో కొన్ని హాస్య చిత్రాలు తెరకెక్కించారు ఇ.వి.వి. 2011 జనవరి 21న ఇ.వి.వి. కన్నుమూశారు. ఆయన లేకపోయినా, ఇ.వి.వి. పండించిన నవ్వుల పువ్వులు మాత్రం ఇంకా సువాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి.
