సినీ కార్మికులు, నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకం అమలుకై సీనియర్ సినీ నటులు నరేష్ వి. కె. సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి. శ్రీనివాస్ నాయుడుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయ్ కృష్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మరియు చిత్రపురి హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. త్వరలో కళాకారుల ఐక్య వేదిక సెంట్రల్ లేబర్ బోర్డ్ అధికారుల సహకారంతో ‘ఈ-శ్రమ్’ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అసంఘటిత కార్మికులకు ఒక పెద్ద వరం అని యూనియన్ లీడర్లు తెలిపారు. ముఖ్య అతిథిగా చైర్మన్ వి. శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే 10 కోట్ల 23లక్షల మంది ఈ పథకంలో నమోదైనట్లు తెలిపారు.
ఈ-శ్రమ్ పథకం ద్వారా ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి నెలకు రూ. 3000/- పెన్షన్ తో పాటు త్వరలోనే అనుసంధానం చేయబోయే అనేక సంక్షేమ పథకాలకు దాదాపు 22వేల మంది సినీ కార్మికులు అర్హులు అయ్యేలా ప్రయత్నిస్తామని అన్నారు. సభా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ప్రమాదకరమైన వాతావరణంలో పని చేసే సినీ కార్మికులకై ‘ఈ-శ్రమ్’ కేంద్ర పథకం ఒక పెద్ద భరోసా అని వ్యాఖ్యానించారు. సినీ నటులకు మరియు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కు సంబంధించిన సభ్యులు ఈ పథకం అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు . కనీసం 8 నుండి 10వేల మంది సినీ కుటుంబాలను లబ్దిదారులుగా చేయడం మన తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు.
ఫెడరేషన్ వల్లభనేని అనిల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం ఇదే మొదటిసారి అని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నటులు శివ బాలాజీ, మాదాల రవి మాట్లాడుతూ వైద్యం అందరికి అందుబాటులోకి తేవడానికి తాము ఎప్పుడూ ముందుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వికాస్ ఐక్యత ఇనిషియేటివ్ కన్వీనర్ శ్రీనివాస్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.