టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. నేను వేరే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది” అని అన్నారు. దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ చిత్రంతో మాకు గొప్ప విజయాన్ని అందించారు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు, ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అని చెప్పారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ”మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం. అ తర్వాత ‘మా వింతగాథ వినుమా’ సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు. ఇప్పుడు ‘డిజె టిల్లు’ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి. ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపం” అని అన్నారు.
