సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చిరుతో ఫోన్ లో మాట్లాడారు. సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి.. టిక్కెట్ రేట్ల గురించి సినీ కార్మికుల బతుకు తెరువు సహా.. పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ సినీరంగం సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పేర్ని నాని చొరవ తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు ఈ నెల చివరి వారంలో ఏపీ సీఎంతో భేటీకి సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు. అయితే చిరంజీవితో పాటు ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్లునున్నారనే విషయం తెలియాల్సి ఉంది.