Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ss Rajamouli Mahesh Babu Priyanka Chopra

Ss Rajamouli Mahesh Babu Priyanka Chopra

SS Rajamouli About Mahesh Babu ad Priyanka Chopra: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందులో మహేష్ ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక చోప్రా ‘మందాకిని’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వారణాసికి సంబంధించిన ప్రత్యేక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘నా సినిమాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల ప్రభావం సాధారణంగా ఉంటుంది. అయితే వారణాసి సినిమాలో మాత్రం రామాయణానికి సంబంధించిన ఒక ఘట్టాన్ని నేరుగా కథలో భాగంగా చూపిస్తున్నా. సినిమా కథకు టైమ్‌లైన్ ఉండనుందని.. క్రీ.పూ. 7000 కాలం నుంచి ప్రారంభమై 2027 నాటి ఆధునిక కాలం వరకు కథ సాగుతుంది. మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే రుద్ర పాత్రను తీర్చిదిద్దాను. మహేష్‌లో సహజంగా కనిపించే టైమింగ్, నిజాయితీని పాత్రలో ప్రతిబింబించేలా రుద్ర క్యారెక్టర్‌ను రూపొందించాను. ఈ పాత్రలో చిలిపితనం మాత్రమే కాకుండా.. పరిస్థితులకు తగ్గట్టుగా ఎంతో నిబద్ధత, తీవ్రత కూడా ఉంటుంది’ అని జక్కన్న చెప్పారు.

‘మందాకిని పాత్ర కోసం ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. అత్యంత యాక్షన్ సన్నివేశాల్లోనూ సమర్థంగా నటించడంతో పాటు అవసరమైన సమయంలో భావోద్వేగాలను, పాత్రలోని సున్నితత్వాన్ని కూడా అద్భుతంగా చూపించగల నటి కావాలని భావించా. ఈ రెండు లక్షణాలు ప్రియాంకలో ఉన్నాయి. అందుకే ఆమెను ఎంపిక చేశా. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పటివరకు రాసిన విలన్ పాత్రల్లోనే అత్యంత భయంకరమైన పాత్రల్లో ఇది ఒకటి. వీల్‌చైర్‌కే పరిమితమై ఉండే ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఆయన కథ, పాత్ర గురించి తెలుసుకున్న వెంటనే ఒకే చెప్పారు’ అని రాజమౌళి వెల్లడించారు.

వారణాసి సినిమా నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల మధ్య ఉండే అవకాశం ఉందని రాజమౌళి తెలిపారు. విదేశాల్లో సాధారణంగా సినిమాలకు ఇంటర్వెల్ ఉండదని.. అయితే భారతీయ సినిమాల్లో ఇంటర్వెల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. కథలో కీలక మలుపులను ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఆస్వాదించేందుకు ఇంటర్వెల్ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వారణాసిలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ.. VFX అనేది కేవలం కథను చెప్పేందుకు ఉపయోగపడే సాంకేతికత మాత్రమేనని స్పష్టం చేశారు. సినిమాలో పాత్రల భావోద్వేగాలే అసలు ప్రధానమని చెప్పారు. ప్రేక్షకులు కథతో, పాత్రలతో కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు జక్కన్న వెల్లడించారు.