టాలీవుడ్లో వైవిధ్యభరితమైన కథాంశాలతో వచ్చే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే కోవలో సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రెడ్ బ్యాగ్’. మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా ఈ చిత్ర అఫీషియల్ టీజర్ను ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదివారం నాడు గ్రాండ్గా రిలీజ్ చేశారు.
విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక పవర్ఫుల్ వాయిస్ ఓవర్ టీజర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లైఫ్లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి..” అంటూ సాగే డైలాగ్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కథ విషయానికి వస్తే.. నలుగురు సాధారణ అమ్మాయిల జీవితాల్లోకి ఒక ‘రెడ్ బ్యాగ్’ ప్రవేశిస్తుంది. ఆ ఒక్క బ్యాగ్ కారణంగా వారి లైఫ్ మొత్తం ఎలా తలకిందులు అయింది? అసలు ఆ రెడ్ బ్యాగ్లో ఏముంది? దానికి అంతర్జాతీయ మాఫియాతో ఉన్న లింక్ ఏంటి? ఆ ప్రమాదం నుండి ఆ నలుగురు యువతులు ఎలా తప్పించుకున్నారు? అనే క్రేజీ ఎలిమెంట్స్తో డైరెక్టర్ రవి కుమార్ ఈ టీజర్ను అత్యంత సస్పెన్స్గా కట్ చేశారు.
ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఎంత గ్లామరస్గా కనిపించారో.. అంతకు మించి వయలెంట్గా స్క్రీన్పై విధ్వంసం సృష్టించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్ ముగింపులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా నటి రాశీ ఇచ్చిన పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ హైలైట్గా నిలిచింది. విలక్షణ నటుడు కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

