విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.ఇలాంటి సమయంలో లోకనాయకుడిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ప్రముఖ నిర్మాతలు లింగుసామి మరియు సుభాష్ చంద్రబోస్ ఈ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రం కోసం కమల్ హాసన్, లింగుసామి మరియు సుభాష్ కలిసి వర్క్ చేసారు.ఆ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కమల్ వారితో మరో సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.30 కోట్ల బడ్జెట్తో మరో సినిమా చేసి గత సినిమా నష్టాన్ని భర్తీ చేస్తానని కమల్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.అయితే హామీ ఇచ్చినప్పటికీ కూడా కమల్ హాసన్ తొమ్మిదేళ్లుగా తమతో ఎలాంటి సినిమా చేయలేదని వారు ఆరోపించినట్టు సమాచారం. తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని లింగుస్వామి అన్నారు. ఈ నష్టాల గురించి అలాగే మరో కొత్త సినిమా నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లింగుసామి తెలిపారు.